Saturday, May 19, 2018

ఇతరులకు నిను నెరుగతరమా?

ఇతరులకు నిను నెరుగతరమా? - అన్నమయ్య సంకీర్తన 



ఇతరులకు నిను నెరుగతరమా
సతత సత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితు లెఱుగుఁదురు నిను నిందిరారమణా ॥పల్లవి॥


నారీకటాక్షపటు నారాచభయరహిత-
శూరులెఱుఁగుదురు నినుఁ చూచేటి చూపు
ఘోరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెఱుఁగుదురు నీదివ్యవిగ్రహము ॥ఇతరు॥

రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగు లెరుఁగుదురు నినుఁ బ్రణుతించువిధము
ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా-
యోగులెఱుఁగుదురు నీవుండేటివునికి ॥ఇతరు॥

పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణులెఱుఁగుదురు నీ పలికేటిపలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస-

స్థిరు లెఱుఁగుదురు నినుఁ దిరువేంకటేశ ॥ఇతరు॥


చాలా గంభీరమైన భావంగల కీర్తన ఇది! 

నిరంతరము సత్య వస్తువును (పరబ్రహ్మమును) ధ్యానించుటయే వ్రతముగా కలిగినవారు, మోహము  ఇత్యాది అరిషడ్వర్గములనుండి సంపూర్ణముగా విడివడినవారు మాత్రమే నీ గురించి తెలుసుకొనగలరు. మిగిలిన వారికి నీ గూర్చి తెలుసుకోవడం సాధ్యమయ్యే పనేనా?

ఆడవారి ఓరచూపులు అనే పదునైన బాణములపట్ల భయ రహితులైన శూరులు (కామమును జయించినవారు) మాత్రమే నిన్ను చూసే  చూపు కలిగి యుంటారు. ఘోరమైన సంసారము (నానాత్వము) అనెడి సంకెళ్లను త్రెంచుకున్న ధీరులైనవారు మాత్రమే నీ దివ్యమైన విగ్రహమును ఎఱుగుదురు. 
     
ఇష్టాఇష్టములనుండి, భోగాసక్తి నుండి విముక్తులైన మహనీయులు మాత్రమే నిన్ను ప్రార్ధించు విధమును ఎఱిగియున్నారు. వేదా శాస్త్రములయందు తెలుపబడిన రీతిన సాధన చేయుచున్న యోగులు మాత్రమే నీయొక్క ఉనికిని ఎఱుగుదురు.

పరమ భాగవతుల యొక్క పాదపద్మములను భక్తితో సేవించి ధన్యులైన వారే నీవు పలికే పలుకులను ఎఱుగగలరు (గ్రహించగలరు). ఓ వెంకటేశ్వరా! శాశ్వత ఆనందమును అనుభవించు స్థిత ప్రజ్ఞులైనవారు (మాత్రమే!) నిన్ను ఎఱుగగలరు. 


No comments:

Post a Comment