Sunday, April 15, 2018

తిరుమల వెంకటేశ్వరుని మూర్తి రూపంలో ఉన్న దేవుడు ఎవరు?


తిరుమలలోని శ్రీవారి అర్చామూర్తి... 

(1) విష్ణువువలే కటి-వరద హస్థుడై ఉంటుంది. పురాణములలో అనేకచోట్ల, ఈ కలియుగములో శ్రీమహవిష్ణువు అర్చావతారముగా వేంకటాచలముపై వెలసినట్లు చెప్పబడినది.

(2) అర్చామూర్తి పరమశివునివలే జటజూటము, నాగాభరణములను ధరించి ఉంటుంది. అంతేగాక సంవత్సరములో ఒక నెల ఈ విగ్రహానికి బిల్వపత్రములతో పూజ చేస్తారు.

(3) శివ పుత్రుడైన కుమార-స్వామి (బాలాజీ?) ఈ పర్వతము పై వెలసినట్లు పురాణములలో కొన్నిచోట్ల చెప్పబడినది ("కలౌ కుమార రూపేణ షణ్ముఖౌ భగవాన్ హరిః దృశ్య తైక ముఖేనైవ వేంకటాచలనాయకః” - మార్కండేయ పురాణం --- ఆరు ముఖాలు కలిగిన "కుమారస్వామి" కలియుగంలో ఏకముఖుడై భగవంతుడైన – "వెంకటేశ్వర స్వామిగా" అనుగ్రహిస్తూ ఉన్నాడు.).

(4) అర్చామూర్తియొక్క సౌకుమార్యమైన సుందర రూపము, వారికి పసుపుతో అభిషేకం చేయడం, కళ్ళకు కాటుక దిద్దడం, స్వామివారి వెలుపలి ప్రాకారములోగల సింహ శిల్పములనుబట్టి ఆమూర్తి అమ్మవారిది అని శాక్తేయులు విశ్వసిస్తారు. 


ఇంతకీ అసలు తిరుమల వెంకటేశ్వరుని మూర్తి రూపంలో ఉన్న దేవుడు ఎవరు?

"అంతా తానే అయిన ఒకే పరతత్వమే ఒక విగ్రహరూపంలో, జీవులను ఉద్ధరించుటకై, అర్చావతారముగా ఈ కొండపై వెలసి ఉన్నది. ఎవరు ఏ రూపములో తనను ఉపాసిస్తే, వారికి ఆ రూపంతోనే అనుగ్రహాన్ని ప్రసాదించే రూపం ఇక్కడ ఉన్నది! ఎవరు ఏ భావంతో ఉపాసిస్తే వారిని ఆవిధంగానే అనుగ్రహిస్తుంది." అని ఆత్మజ్ఞానులైన వారు చెప్పినమాట. 


 ఈ విషయమునుగూర్చి కంచి పరమాచార్యుని మాటలను, తాళ్ళపాక అన్నమాచార్యుని మాటలను ఇక్కడ స్మరించుకుందాము. అటువంటి ఆత్మజ్ఞానులైన మహాత్ములు, ఆచార్యుల వాక్యములే మనకు ప్రమాణము.




అన్నమయ్య కీర్తన:



ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములు ఎంచిచూడ పిండంతే నిప్పటి అన్నట్లు|| || ఎంత ||

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు|| || ఎంత ||

సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపు నీవనుచు
దరిశనముల మిము నానావిధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమ్మునే అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు|| || ఎంత ||

నీవలన కొరతేలేదు మరి నీరుకొలది తామెరవు
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము చేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను ఇదియే పరతత్వము నాకు|| || ఎంత ||

భావము:

పిండి కొలది రొట్టె అన్నట్లుగా, నీవు ఎంతటివాడివని (లేదా ఎవరివని) విశ్వసిస్తే అంతటి (అటువంటి) ఫలితమునే వారికి ప్రసాదిస్తావు. 

వైష్ణవులు నిన్ను విష్ణువంటారు. వేదాంతులు నువ్వే పరబ్రహ్మం అంటారు. శైవులు నిన్నే శివుడని అంటారు. కాపాలికులు తమని రక్షించే భైరవుడవు నీవని పొగడుతారు.

శాక్తేయులు నిన్ను శక్తి రూపంగా తలుస్తున్నారు. వివిధ వర్గాలవారు, వివిధ పేర్లతో దర్శించి పూజించేది నిన్నే. నీగూర్చి తక్కువగా తలచిన వారికి నీవు అల్పునిగానే వ్యక్తమవుతూ ఉంటావు! నీవెంతో ఘనుడవు అని తలచిన బుద్ధిమంతులకు నీ గొప్పతనమును ఆవిధముగానే ఎంతో విశేషముగా తెలియజేసి అనుగ్రహిస్తావు.


నీయందు అల్పత్వము (కొరత) లేదు. నీటియొక్క మట్టాన్ని బట్టి అందులోనున్న తామరపువ్వు యొక్క ఎదుగుదల ఉన్నట్లు, జీవులయొక్క భావనను అనుసరించి వారు పొందే ఫలితము ఆధారపడి ఉంటుంది. గంగానది ఒడ్డునగల బావులలో కూడా ఆ గంగానదిలోని నీరే ఎలా ఊరుతుందో, అలానే నిన్ను ఏరూపంలో ఉపాసించినా ఆ రూపంలోనే వ్యక్తమై అనుగ్రహించేదికూడా నువ్వే. శ్రీ వేంకటచలపతిగా మమ్ము అనుగ్రహించుచున్న నీవు నాకు అన్నిరూపములుగా వ్యక్తమవుతున్న పరతత్వమే. అట్టి నిన్ను నేను శరణువేడుచున్నాను.



కొన్ని పదముల వివరణ:

(1) "అంతరాంతరములు ఎంచిచూడ" = లోతుగా, నిశితముగా చూడగా

(2) "పిండంతే నిప్పటి అన్నట్లు"
నిప్పటి అంటే చక్కిలము లేక అరిసె. "పిండి కొలది రొట్టె" అన్న సామెత వలె, "పిండికొలది నిప్పటి" అనే సామెత అప్పట్లో వాడుకలో ఉండేదట.


(3) "నీరుకొలది తామెరవు":
ఇది అప్పట్లో వాడుకలో ఉన్న సామెత. నీటిమట్టాన్ని బట్టి నీటిలోతేలే పువ్వు పెరుగుదల ఉంటుంది. అలాగే, మనుషుల ఉత్సాహాన్నీ, ప్రేరణనీబట్టి వారి ఎదుగుదల ఉంటుంది అని ఈ సామెత అర్ధము. 


No comments:

Post a Comment